1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (14:30 IST)

మా అమ్మకు గుండెపోటు.. విచారణకు రాలేను.. : సీబీఐకు అవినాష్ సమాచారం

YS Avinash Reddy
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి మరోమారు సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని పేర్కొంటూ సీబీఐకు ఆయన లేఖ రాశారు. 
 
ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చేందుకు ఎంపీ తరపు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. తన తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాష్ పేర్కొన్నారు.
 
సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వరుసగా ఇది రెండోసారి. ఈ నెల 16న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ హైదరాబాద్ నుంచి కడప వెళ్లిపోయారు. 
 
దీంతో సీబీఐ బృందం కూడా అంతేవేగంగా కడప చేరుకోవడం.. అవినాష్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న (నేడు) విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్ ఇవ్వడం ఉత్కంఠ రేపింది.
 
తాజాగా విచారణ కోసం పులివెందుల నుంచి హైదరాబాద్ చేరుకున్న అవినాష్.. మళ్లీ చివరి నిమిషంలో సీబీఐకి లేఖ రాస్తూ తన తల్లి అనారోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేనని పేర్కొన్నారు. అనంతరం తిరిగి ఆయన పులివెందులకు బయల్దేరారు.
 
శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి బయల్దేరారని.. మార్గంమధ్యలో తల్లి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని ఆయన తరపు న్యాయవాది మల్లారెడ్డి తెలిపారు. 
 
అవినాష్ తల్లి గుండెపోటుతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. దీంతో వెంటనే ఆయన పులివెందుల బయల్దేరినట్లు తెలిపారు. దీనిపై సీబీఐకి లిఖిత పూర్వకంగా సమాచారం ఇస్తామని.. వాళ్లు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎలా ముందుకెళ్లాలనేది తాము ఆలోచిస్తామన్నారు. 
 
ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా, ప్రస్తుతం ఆయన హైదరాబాద్ చంచల్‍‌గూడ జైలులో ఉన్నారు. అదువల్ల తన తల్లిని చూసుకునేందుకు అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్ళారని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు.