1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (08:53 IST)

తిరుమల కాలి నడక భక్తులపై చిరుత పులి దాడి.. బాలుడికి గాయాలు

leopard
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కొండపైకి కాలినడక బయలుదేరిన భక్తులపై చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో ఓ బాలుడు గాయపడ్డాడు. సరిగ్గా ప్రసన్నాంజనేయం స్వామి ఆలయం వద్ద భోజనం ఆ దంపతులు ఆగారు. ఆ సమయంలో బాలుడు ఆడుకుంటుండగా ఉన్నట్టు ఒక్కసారిగా వచ్చిన చిరుత.. బాలుడిపై దాడిచేసి నోట కరిపించుకుని ఎత్తుకుపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆ చిరుతను వెంబడించడంతో పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడగా, సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడి ప్రాణానికి వచ్చిన ముప్పేమి లేదని చెప్పారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు కౌశిత్‌ను తీసుకుని నడక దారిలో తిరుమలకు బయలుదేరారు. తిరుమల - అలిపిరి నడక మార్గంలో గురువారం వీరు కొండపైకి బయలుదేరారు. ఆ తర్వాత మొదటి ఘాట్ రోడ్డులోని ప్రస్తన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం కోసం ఆగారు. బాలుడేమే ఆ పక్కనే ఆడుకుంటున్నాడు. ఇంతలో ఆలయం వెనుక నుంచి వచ్చిన ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసి, అతన్ని నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. 
 
దీన్ని గమనించిన తల్లిదండ్రులతో పాటు.. స్థానికులు పెద్దపెట్టున కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. టార్చిలైట్లు, వేస్తూ రాళ్ళు రువ్వుతూ పెద్ద శబ్దంతో అరుస్తూ చిరుత వెంట పరుగు తీశారు. దీంతో కంగారుపడిన చిరుత బాలుడిని పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వదిలిపెట్టి ప్రాణభయంతో పారిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని రక్షించి, వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చెవి వెనుకభాగం, తలపై పలు చోట్ల గాయాలు కాగా, వైద్యులు చికిత్స అందించారు. బాలుడి ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.