1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (08:58 IST)

బల్లి పడిన ఆహారం ఆరగించిన విద్యార్థులు.. ఎక్కడ?

food
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారాన్ని నిజం చేసే ఆ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాఠాశాలల్లో పంపిణీ చేసే పౌషకాహారం పిల్లలకు ప్రాణ సంకటంగా మారింది. ఇటీవల అంగన్ వాడీ కేంద్రాల్లో కాలం చెల్లిన పాల ప్యాకెట్లు కలకలం రేపాయి. తాజాగా పిల్లలకు వడ్డించే భోజనంలో బల్లి, చిక్కీల్లో పురుగులు కనిపించాయి. ప్రతి సభలో పిల్లలకు తనకు తాను మామయ్యగా చెప్పుకొనే సీఎం ఇలాంటి ఆహారంపై ఏం చెబుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 
 
రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని టేకులపాళ్యం ప్రాథమికోన్నత పాఠశాలలో బల్లి పడిన మధ్యాహ్న భోజనం తిని 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒక విద్యార్థి భోజనంలో బల్లి గుర్తించిన పిల్లలు భయంతో వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు వారిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
మరో 21 మంది విద్యార్థులకు సెలైన్లు ఎక్కించారు. మిగిలిన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి పంపారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అగరంపేట ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఇచ్చిన చిక్కీల్లో పురుగులు వచ్చాయి. తల్లిదండ్రులు ఆ చిక్కీల ఫొటోలు విద్యాశాఖ అధికారులకు పంపారు. దీనిపై ఎంఈవో స్పందిస్తూ కాలం చెల్లిన వాటిని గుర్తించి తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించారు.