శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (08:18 IST)

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తుంగభద్ర పుష్కరాల నిర్వహణ: టీడీపీ

రాయలసీమ ప్రాంతంలోని తుంగభద్ర నదికి పుష్కరాలు రావడం జరిగిందని, వాటినిర్వహణను వైభవోపేతంగా, హిందూమత సంప్రదాయాలను గౌరవించేలా నిర్వహించాల్సిన జగన్ ప్రభుత్వం, పుష్కరాలనిర్వహణను గాలికొదిలేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీవీ.జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. పుష్కరాల నిర్వహణకు తూతూమంత్రంగా రూ.250కోట్లు కేటాయించిన రాష్ట్రప్రభుత్వం, కేవలం 20, 30 రోజుల నుంచే పనులు ప్రారంభించి, చిత్తశుద్ధిలేకుండా, ఫోటోలకు ఫోజులిస్తూ, కార్యక్రమాలపర్యవేక్షణపేరుతో అధికార పార్టీనేతలే అంటీముట్లనట్లుగా, కంటితుడుపుగా పనులు చేయించారన్నారు.

కర్నూలు జిల్లాలో 187కిలోమీటర్లవరకు ఉన్న తుంగభద్ర పరీవాహక ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధికిగానీ, రోడ్లకుగానీ,  పుష్కరఘాట్లు, మరుగుదొడ్ల వంటివాటికిగానీ, రూపాయికూడా కేటాయించలేదన్నారు.  పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులపై, ప్రతిపక్షం పలుమార్లు పాలకులను నిలదీసినా ఏనాడు స్పందించలేదన్నారు.

ఇప్పుడేమో కరోనాపేరుతో, పుష్కరస్నా నాలకు అనుమతులు నిరాకరిస్తున్నారని, అటువంటప్పుడు స్నానాలఘాట్లను ఎందుకు నిర్మించారో చెప్పాలని జయనాగేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో ఉన్న త్రేతాయుగకాలం నాటి దేవాలయాన్ని తొలగించారని, పుష్కరాల పనులపేరుతో చేయాల్సిన అభివృద్ధిచేయకుండా, వాస్తుపేరుతో పురాతన ఆలయాన్ని తొలగించడమేంటన్నారు.

జగన్ ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైందని, అటువంటప్పుడు ఈప్రభుత్వం నిర్మాణాలను ఎలా చేస్తుందన్నారు.  ప్రభుత్వం తనచేతగాని తనాన్ని కరోనాముసుగులో దాచేస్తోందని, హిందువుల మనోభా వాలు దెబ్బతినేలా పుష్కరాల నిర్వహణను చేపట్టిందని, అంతిమంగా పుష్కరాల నిర్వహణలో జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.

కాంట్రాక్టర్లపేరుతో ప్రభుత్వం కేటాయించిన రూ.250కోట్ల ప్రజాధనాన్ని వృథాచేయడం తప్ప, పుష్కరాలకోసం ఎలాంటి అభివృద్ధి పనులుచేయలేదన్నారు. హిందూమనోభావాలు దెబ్బతినేలా పుష్కరాల నిర్వహణ చేపట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్న టీడీపీనేత, ఎక్కడాకూడా పుష్కరకేంద్రాలకు వెళ్లే రోడ్లను కూడా బాగుచేయలేదన్నారు.

రోడ్లన్నీ గోతుల మయమైనా ఎక్కడా కూడా వాటిని పూడ్చలేదన్నారు. కరోనా నివారణ చర్యలు చేపడుతూ, సంప్రదాయబద్ధంగా తుంగభద్ర పుష్కరాలను నిర్వహించడం చేతగాని ప్రభుత్వం, చివరకు వాటినిర్వహణనే ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. పుష్కరాల ఘాట్లలో ఇప్పటికీ పనులుచేస్తూనే ఉన్నారని, పిండప్రధానాలు చేయాలంటే, కచ్చితంగా నదీస్నానం చేయాల్సిందేనని, దానికి విరుద్ధంగా నదీస్నానాలకు అవకాశం లేకుండా చేశారన్నారు.

జగన్ ప్రభుత్వం పుష్కరాల నిర్వహణను మాటలకే పరిమితం చేసిందని, చివరకు నదీస్నానాలే లేకుండా పుష్కరాలను నిర్వహించడం శోచనీయమన్నారు. బాణసంచా కాలుస్తూ, వైసీపీనేతలు ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు అడ్డురాని కరోనా నిబంధనలు, 12ఏళ్లకోసారి జరిగే పుష్కరాలకు ఎలా వర్తిస్తాయో చెప్పాలన్నారు. నదిలో పుష్కరుడు ఉన్నప్పుడు, హిందువులు స్నానంచేయకుండా అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు.

లక్షలసంఖ్యలో వచ్చే భక్తుల రాకను కట్టడిచేయడం ప్రభుత్వం వల్ల కానేకాదని జయనాగేశ్వరరెడ్డి తేల్చిచెప్పారు. హిందువుల మనోభావాలకు సంబంధించిన పుష్కరాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయకుండా, ముఖ్యమంత్రి వాటిని ప్రారంభిస్తే మాత్రం ఉపయోగం ఏముంటుం దన్నారు. నదీస్నానాలకు అవకాశంలేకుండా జల్లుస్నానాలతో సరిపెడితే, ఎందరు భక్తులకు స్నానమాచరించే అవకాశం ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి పుష్కరాలకు రాగానే ఆయనే అక్కడ స్నానం చేయాలని, అప్పుడే భక్తులకు నమ్మకం ఏర్పడుతుందని టీడీపీనేత స్పష్టంచేశారు. అధికారులు ఎంతటి నిబద్ధతతోపనిచేశారో ముఖ్యమంత్రికికూడా అప్పుడే తెలిసి వస్తుందన్నారు.