గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:03 IST)

భార్య సర్పంచ్‌గా గెలిచిందనీ.. 120 మందికి గుండు కొట్టించిన భర్త

ఎన్నికల్లో పోటీ చేసే నేతలు తమ గెలుపు కోసం మొక్కని దేవుళ్ళు ఉండరు. అలాగే, వారు ఇవ్వని హామీలంటూవుండవు. గెలిచిన తర్వాత మొక్కులు తీర్చేవారు, ఇచ్చిన హామీలు నెరవేర్చేవారు ఎంతమందో ఉంటారో తెలియదు. కానీ, ఈ మహిళా సర్పంచ్ భర్త మాత్రం తన మొక్కును తీర్చుకున్నాడు. మొక్కు చెల్లింపులో భాగంగా తనతో పాటు మొత్తం 120 మందికి గుండు చేయించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. ఈ ఎన్నికల్లో మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్‌గా శ్రీనివాస్ అనే వ్యక్తి భార్య స్వరూప పోటీ చేసింది. ఈమె గెలిస్తే తిరుపతికి వస్తానని మొక్కుకున్నాడు. 
 
ఆ తర్వాత ఎన్నికల్లో స్వరూప గెలుపొందడం జరిగింది. ఇక ఆమె భర్త శ్రీనివాస్ మొక్కు తీర్చుకునే వంతు వచ్చింది. ఇందుకోసం తనతో పాటు.. గ్రామంలోని 120 మందిని తీసుకుని మూడు బస్సుల్లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ వారందరికీ తన సొంత ఖర్చులపై గుండ్లు కొట్టించాడు. అలా సర్పంచ్ భార్య స్వరూప భర్త శ్రీనివాస్ వార్తలకెక్కాడు. 
 
దీనిపై గ్రామ ప్రజలు స్పందిస్తూ, ఎన్నికల సమయంలో వందో.. వెయ్యో చేతిలో పెట్టి తర్వాత మరిచిపోయే ఈరోజుల్లో.. గెలిచాక తమ అందరిని తిరుపతి తీసుకెళ్లి వెంకన్న దర్శనం చేయించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీనివాస్ వంటి వ్యక్తులు నేటి రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే ఉంటారని తెలిపారు.