శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:08 IST)

ఉల్లి కోసం వెళ్తే తొక్కిసలాట.. కేజీ ఉల్లిపాయల కోసం ప్రజల ప్రాణాలు తీసేస్తారా?

ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి కోసం విజయనగరం జిల్లా పార్వతీపురంలో తొక్కిసలాట జరిగింది. ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఉల్లి సబ్సిడీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
మార్కెట్లో రూ.100 పలుకుతున్న ఉల్లిని ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.25కే అందిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉల్లిని కొనేందుకు రిటైల్ కేంద్రానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. 
 
లోపలి నుంచి నిర్వాహకులు గేట్లు తీయడంతో జనమంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో తోపులాటలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు కిందపడిపోయారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
సీఎం జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. పెరుగుతున్న ఉల్లి ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 
 
జగన్ పాలనలో ఇసుక కోసం ధర్నాలు, ఉల్లి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని విమర్శలు గుప్పించారు. 
 
కేజీ ఉల్లిపాయల కోసం ప్రజల ప్రాణాలు తీసే వరకు వచ్చిందంటూ.. విజయనగరంలో జరిగిన తొక్కిసలాట వీడియోను లోకేష్ షేర్ చేశారు.