1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (12:49 IST)

మురుగు కాలువలో దిగి నిరసన తెలిపిన వైకాపా ఎమ్మెల్యే

kotamreddy sridhar reddy
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈ క్రమంలో మరోసారి కాల్వలో దిగి నిరసన తెలిపిన కోటంరెడ్డి.. రైల్వే, నగర కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా సమస్యల పరిష్కారంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ఎప్పటిలోపు పనుల ప్రారంభిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని.. అంతవరకు కాల్వ వద్ద నుంచి కదలబోనని స్పష్టం చేశారు. 
 
ఇచ్చిన గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే మురుగునీటిలోనే పడుకుంటానని చెప్పారు. దీంతో అధికారులు ఈనెల 15న నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే నెల 15లోపు పూర్తిచేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం కోటంరెడ్డి తన నిరసనను విరమించారు.