1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 మే 2020 (13:07 IST)

సీఎం జగన్ ఎత్తుకు షాకిచ్చిన ఎన్జీటీ... పోతిరెడ్డిపాడుకు బ్రేక్

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి‌ వ్యూహానికి జాతీయ హరిత ట్రిబ్యునర్ తేరుకోలేని షాకిచ్చింది. సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ కెపాసిటీ పెంపునకు సంబంధించి ఏపీ సర్కారు జారీచేసిన జీవో 203కి స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. 
 
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు, కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్‌ సభ్యుడు, హైదరాబాద్‌ ఐఐటీ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు. రెండు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించొద్దని ఏపీకి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. 
 
కాగా, ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ ఈఎస్‌సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ రాసిన విషయం తెల్సిందే. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలంటూ ఆ లేఖలో కోరారు. 
 
మే నెల వరకు ఇచ్చిన కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకున్నారంటూ లేఖలో ఆరోపించారు. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వని విధంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇపుడు ఎన్జీటీ కూడా స్టే విధించడంతో జగన్ చర్యలకు బ్రేక్ పడినట్టయింది.