శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 18 మార్చి 2023 (16:12 IST)

పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానం ఇదేనా?

pawan kalyan
వచ్చే యేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతుంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి బరిలోకి దిగనున్నారు. ముఖ్యంగా, ఆయన కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి రెండోసారి పోటీ చేసిన ఏ ఒక్క నాయకుడు మళ్లీ గెలిచిన దాఖలాలు లేవు. అంటే తమకు అవసరమైన నేతలను ఎన్నుకోవడంలో పిఠాపురం ఓటర్లు ఎంతో చైతన్యవంతులనే నమ్మకం ఉంది. అందుకే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ స్థానం ఓటర్లు రాజకీయ వైవిధ్యం చూపుతారని చెబుతుంటారు. 
 
ఈ నియోజకవర్గంలో మొత్తం మూడు మండలాలు ఉండగా, 2.36 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. వీరిలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లే కీలకం. ఇవి 80 వేల వరకు ఉన్నాయి. బీసీల ఓట్లు 79 వేలు ఉండగా, మిగిలిన ఓట్లు ఇతర కులాలకు చెందినవి కావడం గమనార్హం. పైగా, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాపు నేతలే ఉన్నారు.
 
ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపు సామాజికవర్గానికి చెందిన వైకాపాకు చెందిన పెండెం దొరబాబు ఉన్నారు. ఉప్పాడ దగ్గర 450 కోట్లతో అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్, 2 వేల ఎకరాల భూమి రైతులకు తిరిగివ్వడం, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో.. అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు ఇతర అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే ఈ స్థానం టిక్కెట్ కేటాయించవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. 
 
అయితే, కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత కూడా ఈ దఫా పిఠాపురం నుంచి పోటీ చేయాలన్న గట్టిపట్టుదలతో ఉన్నారు. అయితే, ఆమెకు సీఎం జగన్ టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ, ఆమె మాత్రం ఈ స్థానం నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అదేసమయంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది.