గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (13:42 IST)

అసెంబ్లీలో ఫ్యాన్, స్టాండులో సైకిల్, క్యాంటీన్‌లో గ్లాసు : పృథ్వీ జోస్యం

ఈనెల 11వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ఘన విజయం సాధించనుందని సినీ హాస్య నటుడు, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అలాంటి నేతలకు శాశ్వత విశ్రాంతి కల్పించాలని పిలుపునిచ్చారు. ఈనెల 11వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి.. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 
 
అదేసమయంలో నరసాపురంలో వైకాపా తరపున పోటీ చేస్తున్న రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషమన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. జనసేన నేత నేతలు నాగబాబు, పవన్‌లు మాట్లాడే భాష సరికాదన్నారు. నటన వేరు రాజకీయం వేరన్నారు. 
 
వైఎస్‌ జగన్‌ ఏపీలో జగన్ సీఎం కావాలని రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బాబు సీఎంగా అనర్హుడని పృథ్వీ మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు జీవితమంతా కాపీనే అని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్‌గా మారారని నిప్పులు చెరిగారు. ముస్లిం ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాని రాష్ట్రానికి తీసుకు వచ్చారని మండిపడ్డారు. మే 23వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీలో ఫ్యాన్, స్టాండులో సైకిల్, క్యాంటీన్‌లో గాజు గ్లాసులు ఉంటాయని పృథ్వీ జోస్యం చెప్పారు.