1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (12:28 IST)

సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి దృష్టికి తీసుకెళ్తా : ఆర్ఆర్ఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కోరడంపై ఇప్పటికే ఆ పార్టీ రెబెల్ నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. 
 
తమ నాయకుడు జగన్ మాట్లాడిన మాటలను ఎవరైనా ఈసీ దృష్టికి తీసుకెళ్తే తొలుత వైసీపీ గుర్తింపు రద్దవుతుందన్నారు. అయినా, ఎవరో ఎందుకని, తానే ఆ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. 
 
అసెంబ్లీ సాక్షిగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎన్నో గొప్ప పదాలు ఉపయోగించారని, అప్పుడు జగన్ మనసు నొచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. అసభ్య పదజాలం వాడిన జోగి రమేశ్‌ను జగన్ మెచ్చుకున్నారని గుర్తుచేశారు. అలాంటి వారు ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నారని రాఘురామరాజు ఎద్దేవా చేశారు.
 
మరోవైపు, టీడీపీ నేతలు కూడా వైకాపా నేతలపై మండిపడుతున్నారు. అసభ్య పదజాలం వాడకానికి కేరాఫ్ అడ్రస్ వైసీపీయేనని, తొలుత ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయించుకుని, ఆ తర్వాతే మిగతా పార్టీల గురించి మాట్లాడాలని విజయసాయి రెడ్డికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హితవు పలికారు.