మంగళవారం, 17 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (14:36 IST)

విజయవాడ - బెంగుళూరు మధ్య వందే భారత్ రైలు!!?

vande bharat sleeper
దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతున్న వందే భారత్ రైళ్ళ సంఖ్యను మరింతగా పెంచేందుకు భారత రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులోభాగంగా, కొత్తగా ప్రవేశపెట్టే రైళ్లలో ఒక రైలును విజయవాడ - బెంగుళూరు ప్రాంతాల మధ్య నడపాలని భావిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల అమలు జాప్యానికి గల కారణాలపై ప్రశ్నలు సంధించారు. 
 
దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. అనకాపల్లి స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో చేర్చి, దాని అభివృద్ధికి మాస్టర్న్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి చాలా కారణాలున్నాయని, అందులో భూసేకరణలో జాప్యం అత్యంత ప్రధానమైందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సుహృద్భావ వాతావరణంలో పనిచేసి భూసేకరణ వేగవంతంగా జరిగేలా చూస్తామని వివరించారు. 
 
విజయవాడ, ముంబై మధ్య దూరం ఎక్కువ కావడంతో ఆ రెండు స్టేషన్ల మధ్య పగటి పూట వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బెంగళూరు - విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఈ స్టేషన్‌ త్వరలోనే ఉపయోగంలోకి వస్తుందని తెలిపారు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేపరంగా చాలా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్ విస్తరణ ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైంది. అమృత్ భారత్ స్టేషన్‌లో చేర్చిన దీని ఆధునికీకరణకు మాస్టర్ ప్లానింగ్ పూర్తయింది. దేశంలో అత్యధిక రద్దీ ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడను వచ్చే 50 ఏళ్ల కాలాన్ని, సమీపంలో ఉన్న అమరావతిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఇతర ప్రాజెక్టు వివరాలను ఎంపీకి అందజేస్తాం అని సమాధానమిచ్చారు.