1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 జులై 2021 (10:48 IST)

'శ్రీశైలం' జలాశయం నుండి నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైలం ఆలయ ఇఒ కెఎస్‌.రామారావు డ్యాం రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 53,488 క్యూసెక్కులు విడిచిపెట్టారు.

జూరాల డ్యాం గేట్ల నుంచి 3,83,514 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 79,023 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తం 4,62,537 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 35,315 క్యూసెక్కులు, ఎపి జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 31,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 882.10 అడుగులకు చేరుకుంది. జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా, ప్రస్తుత 199.7354 టిఎంసిలు ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుండి పోతిరెడ్డిపాడుకు 11,583 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,807, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి ప్రస్తుతం ఉన్న నీటి ప్రవాహం కొనసాగితే గురువారం మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న నీరు గురువారం ఉదయానికి నాగార్జున సాగర్‌ డ్యాంకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ డ్యాం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, బుధవాం సాయంత్రం 541.90 అడుగులకు చేరుకుంది.

ఇన్‌ఫ్లో 66,325 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో వెయ్యి క్యూసెక్కులు ఉన్నాయి. పులిచింతల జలాశయ గరిష్ట నీటిమట్టం 45.77 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 43.50 టిఎంసిలకు చేరుకున్నాయి. ఇన్‌ఫ్లో 4,178 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 6,433 క్యూసెక్కులు ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీకి 22,212 క్యూసెక్కులు ఎగువ నుంచి వస్తుండగా, 25,003 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.