గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

భారతీ సిమెంట్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

supreme court
వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగగా, భారతీ సిమెంట్స్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను గతంలో ఈడీ స్వాధీనం చేసుకోగా, వీటిని తిరిగి ఇచ్చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఈడీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేయగా, మంగళవారం వాదనలు జరిగాయి. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలను వినిపించారు. ఈ కేసుకు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు లేదా ఎఫ్‌డీలలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోర్టు చెప్పిందని... దీంతో, ఎఫ్‌డీ‌లనే ఈడీ ఎంచుకుందని ధర్మాసనానికి ఎస్వీ రాజు తెలిపారు. 
 
బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా కల్పించుకుంటూ... మీరు ఎఫ్‌డీలను నగదుగా మార్చుకున్నారని ప్రతివాదులు చెపుతున్నారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని... దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. ఎఫ్‌డీ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలన్న టీఎస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునే విషయాన్ని ప్రతివాదులకే వదిలేస్తున్నామని చెప్పారు.