1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 19 జనవరి 2022 (17:40 IST)

పగలు సైకిల్ పైన‌... రాత్రి ఫ్యాన్ కిందకు ... మంగ‌ళ‌గిరిలో లోకేష్ ప్ర‌క్షాళ‌న‌

టీడీపీలో ఇంత‌కాలం అంతా ప‌ద‌వులు అనుభ‌వించేవారే కానీ, పార్టీకి బోయ‌లుగా ప‌ల్ల‌కీ మోసేవారు క‌రువ‌య్యారు. పైగా కోవ‌ర్డులు ఎక్కువ అయ్యారు. అందుకే టీడీపీ ఓట‌మి పాల‌వుతోంద‌ని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. 
 
 
పగలు అయితే  సైకిల్ పై... రాత్రాయితే ఫ్యాన్ కిందకు ... ఇలా రెండు నాల్క‌ల ధోర‌ణిలో పార్టీని నాశ‌నం చేస్తున్న, ప్రత్యర్దులతో కుమ్మకై  కుటీల పన్నాగాలు ప‌న్నుతున్న వారిని ఏరివేసే ప‌నిని పార్టీ ప్ర‌ధాన కార్య‌దర్శి లోకేష్ ప్రారంభించారు. వారంతా ఇంత‌కాలం ఆధికారం  అనుభవించారు. లబ్ది పొందారు. స్వలాభం, స్వార్దంతో  ప్రత్యర్దులతో కుమ్మకై  నమ్మక ద్రోహం, వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు. 

 
మంగళగిరి టిడిపిలో జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం అని పార్టీ అధిష్టానం ఆలోచ‌న‌లో ప‌డింది. నారా లోకేష్ ను బలహీనపరిచేందుకేనా... ప్రత్యర్దులతో కుమ్మకు? అనే దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారు. అందుకే  ప్రక్షాళన దిశగా నారా లోకేష్  ఆడుగులు వేస్తున్నారు. దీనితో మంగళగిరిలో రాజకీయం వేడేక్కింది. కష్టపడి పనిచేసిన వారి భవిష్యత్ నాది అంటూ  సంస్దాగతంగా క్రింది స్దాయిలో లోపాలను సరిచేసుకుంటూ లోకేష్ ముందడుగు వేస్తున్నారు. పుట్టలో పాములను, కట్టప్పలను పోగబెట్టి బయటకి లోకేష్ టీం ర‌ప్పిస్తోంది. 
 
 
వెనక ఉండి కధ నడుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది టిడిపి అదిష్టానం.  లోకేష్ కోసం బలంగా పనిచేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్న ప్రత్యర్దుల‌ను పట్టుకుంటున్నారు. ఇటువంటి వారు అవసరమా అని మంగళగిరి నియోజకవర్గ  టిడిపి కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కట్టప్ప లాంటి నమ్మకద్రోహులను, పార్టీకి చీడగా మారిన వారిని పారద్రోలే దిశగా పార్టీ శ్రేణులు ..వదులుకోవటం కాదు.. . వదలించుకుంటున్నారనే భావన ప్రజల్లో  వ్యక్తం ఆవుతుంది. 

 
మంగళగిరి నియోజకవర్గ టిడిపిలో జరుగుతున్న పరిణామాలపై ఆధిష్టానం తీవ్రంగా పరిగణించటంతో పాటు వెన్నుపోటు దారులు, నమ్మక ద్రోహులపై , బహిష్కరణ ఆస్త్రం ప్రయోగించి, పార్టీ నుండి సాగనంపే దిశగా అడుగులు వేయటం శుభ శూచకం అని తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు.