1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (09:49 IST)

నేటి నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి మెట్ల మార్గం

tirumala
గత యేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్ల మార్గం గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. గత ఐదు నెలలుగా కొనసాగిన మరమ్మతు పనులు తితిదే అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మార్గాన్ని గురువారం నుంచి భక్తుల కోసం ప్రారంభించనున్నారు. ఇందుకోసం నిర్వహించే ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆయన గురువారం తిరుపతి పర్యటనకు వస్తున్నారు. 
 
కాగా, గత యేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ఈ మెట్లమార్గం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. దీనికి ఐదు నెలలుగా మరమ్మతులు చేపట్టారు. తిరుమలకు నడిచి వెళ్లేందుకు భక్తులు అలిపిరి మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఉపయోగిస్తుంటారు. ఈ మెట్ల మార్గానికి మరమ్మతులు చేసేందుకు రూ.3.60 కోట్లను తితిదే ఖర్చు చేసింది. 
 
800, 1200 మెట్ల వద్ద కూలిపోయిన వంతెనలను కూడా పటిష్ఠంగా నిర్మించారు. గురువారం ఈ మార్గానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను అనుమతిస్తారు. ఈ మార్గం ద్వారా కొండపైకి వెళ్లాలనుకుంటున్న భక్తులు ఇప్పటికే చాలా మంది అక్కడకు చేరుకున్నారు.