శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (16:41 IST)

తెలంగాణాలో రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు: కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగుతోందని, రెండేళ్లలో తెరాస ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన మూడో రోజు భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయవాద భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేద‌ని, ఒకరో, ఇద్దరో గెలిచినా తిరిగి తెరాస గూటికి చేరుతారని జోస్యం పలికారు.
 
హుజూరాబాద్‌లో కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా, కోట్లు ఖర్చు పెట్టినా అంతిమంగా ధర్మమే గెలుస్తుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామసుందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నాయకులు గూడూరు నారాయణరెడ్డి, బర్ల నర్సింగరావు ఆయనతో పాటు ఉన్నారు. తొలుత సాయిబాబా గుడి నుంచి వినాయక్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రగతినగర్‌లోని చౌక ధరల దుకాణాన్ని కిషన్‌రెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి బీబీనగర్‌కు బయల్దేరారు.