1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (12:49 IST)

గృహ హింస కేసులో గెలిచిన మాజీ మంత్రి కన్నా కోడలు.. రూ.కోటి పరిహారం

గృహ హింస కేసులో మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు విజయం సాధించారు. దీంతో ఆమెకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు తన మేనమామ కుమార్తె శ్రీలక్ష్మి కీర్తిని గత 2006లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి నాగరాజు తల్లి విజయలక్ష్మికి ఏమాత్రం ఇష్టంలేదు. దీంతో వివాహం జరిగిన కొంతకాలం తర్వాత వారిమధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
అదేసమయంలో 2013లో శ్రీలక్ష్మీ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా గొడవలు సద్దుమణగలేదు కాదా మరింత పెద్దవి అయ్యాయి. దీంతో గత 2015లో తల్లీబిడ్డను ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో శ్రీలక్ష్మీ కోర్టును ఆశ్రయించారు. గృహ హింస పిటిషన్‌‍ను దాఖలు చేయగా, విజయవాడ ఒకటో చీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. 
 
బాధితురాలికి పరిహారంతో పాటు కుమార్తెకు ఇంట్లో భాగస్వామ్యం కల్పించాలని ఆదేశించింది. పైగా, తీర్పు వెలువడిన మూడు నెలల్లోపు ఆదేశాలన్నీ అమలు చేయాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. అంతేకాకుండా, కుమార్తె, కుటుంబ పోషణ నిమిత్తం శ్రీకీర్తికి నెలకు రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ.వెయ్యి ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, పాప వైద్య ఖర్చులకు ఖర్చు చేసిన రూ.50 వేలను కూడా కన్నా నాగరాజు చెల్లించాలని కోర్టు తీర్పును వెలువరించింది.