ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (11:20 IST)

రూ.3 వేల కోసం భార్యను కత్తితో పొడిచి చంపేన కసాయి భర్త!

కృష్ణాజిల్లాలోని పాయకాపురంలో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త తన భార్యను అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశఆడు. ఈ ఘటన నున్న గ్రామీణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పాయకాపురం ఎల్‌బీఎస్‌నగర్‌లో జరిగింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వడ్డాది దుర్గారావు, నీరజ(20) దంపతులకు 4 నెలల క్రితం వివాహమైంది. నీరజ మొదటి భర్త చనిపోగా, దుర్గారావు మొదటి భార్య విడాకులు తీసుకోవడంతో.. వీరిద్దరికీ పెద్దల సమక్షంలోనే రెండో పెళ్లి చేశారు. 
 
దుర్గారావు బీసెంట్‌రోడ్డులోని ఓ దుకాణంలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. వివాహమైన తర్వాత 2 నెలల వరకు దంపతులు బాగానే ఉన్నారు. తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో నీరజ భర్త నుంచి దూరంగా వాంబేకాలనీలో ఉంటోంది. 
 
గతంలో కలిసి ఉన్న సమయంలో దుర్గారావు 3 వేల రూపాయిలు నీరజకు ఇవ్వాల్సి ఉండగా.. ఆ నగదును తరచూ ఆమె అడుగుతుండేది. అతడు ఇవ్వకపోవడంతో నిలదీసేందుకు బుధవారం సాయంత్రం ఎల్‌బీఎస్‌నగర్‌లోని దుర్గారావు ఇంటికి వచ్చింది. 
 
తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, రూ.3 వేలు ఇవ్వాలని కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంతో.. విచక్షణ కోల్పోయిన దుర్గారావు ఇంట్లోని చాకుతో బలంగా పొట్ట భాగంలో పొడవడంతో అక్కడికక్కడే ఆమె చనిపోయింది. 
 
ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం తెలుసుకున్న నున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నీరజ సోదరుడు సి.హెచ్‌.చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.