1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (12:16 IST)

టీవీల్లో నటించాలన్న కోరిక.. అందుకే ఇంటి నుంచి పారిపోయారు..

woman
టీవీల్లో నటించాలన్న కోరికతో వారే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల కేసులో ప్రాథమిక విచారణలో తేలింది. కృష్ణా జిల్లా కంకిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల అదృశ్యంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
అదృశ్యమైన ఇద్దరు బాలికలకు నటన అంటే ఎంతో ఇష్టం. ఇద్దరిలో ఓ అమ్మాయి ఇటీవల తల్లితో కలిసి ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. ఆడిషన్స్‌లో ఆమె మెప్పించినప్పటికీ చిన్న వయసు కావడంతో తర్వాత చూద్దామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.
 
అదృశ్యమైన మరో బాలికకు టిక్‌టాక్‌లో వీడియోలు చేసే అలవాటుంది. వీరి ఆసక్తిని గమనించిన జోజి అనే పొరుగింటి వ్యక్తి మాయమాటలు చెప్పి నమ్మించి వారిని తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. నిందితుడి భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడంతో దీనిని అదునుగా తీసుకుని టీవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని వారిని తీసుకెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. 
 
మరోవైపు, తమకు టీవీల్లో ఆఫర్లు వస్తున్నాయని, త్వరలోనే హైదరాబాద్ వెళ్తామని బాలికలు తమ స్నేహితులతో చెప్పినట్టు తెలుస్తోంది. విద్యార్థులను నిందితుడు కంకిపాడు నుంచి బైక్‌పై విజయవాడ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లినట్టు సీసీటీవీల్లో రికార్డైంది.