1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (22:30 IST)

కరోనా కష్టకాలంలోనూ గిరిజనులకు అండ: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

గిరిజన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ద్వారా గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత అధికంగా గిరిజన ఉత్పత్తులను సేకరించగలిగామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ జీసీసీ గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారాన్ని చేయడం ద్వారా కరోనా కష్టకాలంలోనూ గిరిజనులకు అండగా ఉంటూ ఆర్థిక చేయూతను అందించిందని వివరించారు. గత ఏడాదిలో రూ.368 కోట్ల వ్యాపారాన్ని చేసిన జీసీసీ ఈ ఏడాది రూ. 450 కోట్ల వ్యాపారాన్ని చేసిందని వెల్లడించారు.
 
జీసీసీ ద్వారా 2020-21 ఏడాదిలో సాగించిన ఆర్థిక కార్యకలాపాలలో సాధించిన ప్రగతిని గురించి శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పుష్ప శ్రీవాణి వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు సేకరించే చిన్నతరహా అటవీ ఉత్పత్తులను, ఏజేన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసే వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ సేకరించడం ద్వారా గిరిజనులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించేలా చూస్తుందని చెప్పారు.

అటవీ ఉత్పత్తులలో ముఖ్యంగా తేనె, చింతపండు, కుంకుడుకాయలు, నన్నారి ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తులలో కాఫీ, రాజ్మా, పసుపు, రాగి, జీడిపప్పు తదితరాలను జీసీసీ సేకరించి వాటిని మార్కెట్లో విక్రయిస్తుందని చెప్పారు. ఇదికాకుండా ప్రత్యేకంగా పెట్రోల్ పంపులను, సూపర్ బజార్లను నిర్వహించడంతో పాటుగా పౌరసరఫరాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా గిరిజన ప్రాంతాల్లో జీసీసీ చేపడుతోందని తెలిపారు.

గిరిజనులు సేకరించిన ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయడంతో పాటుగా గిరిజన రైతులకు అవసరమైన రుణాలను కూడా జీసీసీ ఇవ్వడం జరుగుతోందని వివరించారు. అటు ఉత్పత్తుల సేకరణలోనూ, ఇటు అమ్మకాలలోనూ జీసీసీ గణణీయమైన ప్రగతిని సాధించగలిగిందని చెప్పారు. 2019-20 సంవత్సరంలో అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు రూ.13.18 కోట్లను వెచ్చించడం జరిగిందని చెప్పారు.

అయితే 2020-21 సంవత్సరంలో రూ.76.37 కోట్లతో వీటిని సేకరించామని తెలిపారు. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు కూడా 2019-20లో రూ.24.22 కోట్ల మేరకు జరగగా 2020-21లో ఈ అమ్మకాలు కూడా రూ.33.07 కోట్లకు పెరిగాయని వివరించారు. త్తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాధ్యమైయిందని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు.

2019-20 సంవత్సరం మొత్తం మీద జీసీసీ తన కార్యక్రమాల ద్వారా రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగలిగిందని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన 2020-21 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉండి వ్యాపార కార్యకలాపాలకు విఘాతం వాటిల్లినా, గిరిజన ఉత్పత్తుల సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యల ఫలితంగా 2020-21లో జీసీసీ రూ. 450.68 కోట్ల మేరకు వ్యాపారాన్ని చేయగలిగిందని వెల్లడించారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ గతేడాది కంటే మెరుగైన ఫలితాలను సాధించిన జీసీసీ అధికార సిబ్బందిని పుష్ప శ్రీవాణి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీసీసీ  ద్వారా మరింత ఎక్కువగా కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.