శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (19:06 IST)

మహిళలకు అన్ని రంగాల్లోనూ సముచిత స్థానం .. ఏపీ శాసనసభాపతి

వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇవ్వడం సరైన వ్యక్తికి సరైన పదవి అని స్పీకర్ తమ్మినేని సీతారాం మహిళా రిజర్వేషన్లతో చాలా మార్పులు రాబోతున్నాయని, భవిష్యత్తులో చాలా పదవులలో మహిళలు కుర్చోబోతున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

సోమవారం తాడేపల్లిలోని సి.యస్.ఆర్ కళ్యాణమండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా క్యాబినెట్ హోదాతో నియమితులైన వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారోత్సవానికి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ... ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అన్న నినాదాన్ని మాటలకు పరిమితం చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. మహిళల కోసం చారిత్రక చట్టాలు అసెంబ్లీలో ఇటీవల అమోదం పొందాయన్నారు.

రాజకీయాలు కలుషితం అయిన ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మకమైన చట్టాలు తెచ్చిందన్నారు. అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడంతో నాడు మూతపడిన పాఠశాలలలో నేడు సీట్లు దొరకని పరిస్థితి వచ్చిందని తల్లులు తమ పిల్లలను చదివించుకోగలుగుతున్నారన్నారు. అర్హత కలిగిన వ్యక్తికి అర్హత కలిగిన పదవి వాసిరెడ్డి పద్మకు ముఖ్యమంత్రి ఇచ్చారని ఇది జగన్మోహన్ రెడ్డి వాసిరెడ్డి పద్మకు ఇచ్చిన అపూర్వ కానుక అని ఆయన అన్నారు.

రాగద్వేషాలకు, భయాలకు అతీతంగా పనిచేయాలని, సాహసోపేతంగా ముందుకు వెళ్లేందుకు మీ వెనుక మేము ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి అధికార ప్రతినిధులుగా తొమ్మిదేళ్లు నేను, వాసిరెడ్డి పద్మ అన్నా, చెల్లెలుగా కలసి పనిచేశామని, ఎడిటర్గా ఆమె కలం పట్టి తరువాత గళం విప్పారని ఆయన పేర్కొన్నారు.

మహిళా సమస్యలపై గళం విప్పిన రోజాను గత ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని, హైకోర్టు, సుప్రీం కోర్టులు అనుమతించమని ఆదేశించినా ఆమెను ఆసెంబ్లీలోకి రానీయలేదన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారు అలా వ్యవహరించవచ్చా అని ఆయన అన్నారు. గతంలో పనిచేసిన వారిపై గత వారం రోజులుగా పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయని, వాటిని చూస్తుంటే చాలా బాధ కలుగుతుందన్నారు.

ఉపముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వారిలో ఒకరు రోజా అయితే మరొకరు వాసిరెడ్డి పద్మ అని పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్లు వేదికలపై గళమెత్తిన మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ అని చెప్పారు.

మహిళలకు న్యాయం చేయాలనే తపన కలిగిన మహిళా పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. మహిళా కమిషన్ చైర్మన్ గా మహిళలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని మంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రతి మహిళ సాధికారిత సాధించాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన అన్ని అంశాలకు కట్టుబడి ముఖ్యమంత్రి హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు. మహిళా పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు మహిళలను మంత్రులుగా చేసి వారిలో ఓ మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు.

ఆశా వర్కర్ల జీతాలను రూ.10 వేలకు పెంచారని, అంగన్ వాడీలకు వెయ్యి రూపాయలు పెంచడం జరిగిందన్నారు. పిల్లలు బడి మానివేయకుండా అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉందన్నారు.

సైబర్ క్రైమ్ నేరాల బారిన పడి ఇబ్బంది పడుతున్న యువతులు, మహిళలు ఫిర్యాదు చేసేందుకు సైబర్ స్పేస్ రూపొందించి వాట్స్ అప్, ఫేస్ బుక్ ఎకౌంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంచి వాక్ చాతుర్యం, నిరాడంబరత, కుండబద్దలు కొట్టినట్లు నిర్మొహమాటంగా మాట్లాడటం, రచయిత్రి, ఎడిటర్ తదితర అన్నింటిలో గుర్తింపు కలిగిన వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్మన్గా నియమించడం హర్షణీయమన్నారు.

ఉపముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం బాగుపడాలని ముఖ్యమంత్రి మధ్యపానని షేదం తీసుకువస్తున్నారని దీనికి ప్రతి ఒక్క మహిళ సహకరించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు చేసినట్లు, పార్లమెంట్లో 50 శాతం రిజర్వేషన్లకు చట్టం చేయాలని కోరారు.

ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె.రోజా మాట్లాడుతూ పార్టీకోసం, మహిళా సమస్యల మీద గళం విప్పి పోరాడిన వ్యక్తి పద్మ అని, చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తి అని అన్నారు. ఆమె కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మహిళా కమీషన్ నిస్తేజంగా మారిందని, మహిళలు, యువతులు, అధికారులపై దాడులు జరిగితే మహిళా కమీషన్ స్పందించలేని పద్దతిలో ఉండేదన్నారు.