సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:09 IST)

వైఎస్ కుటుంబ వ్యాపారాలకు జగన్ ఒక గార్డియన్ మాత్రమే.. వైఎస్ షర్మిల

Sharmila
తన అన్న, వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు ఎండగట్టారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ కుటుంబ వ్యాపారాలకు జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక గార్డియన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం మూడు పేజీలతో కూడిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. వైఎస్ ఉన్నపుడు స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలేనని తేల్చి చెప్పారు. తన తండ్రి వైఎస్ స్థాపించిన వ్యాపారాలు జగన్ సొంతం కాదన్నారు. ఈ రోజువరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క  ఆస్తి కూడా తన చేతుల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ బతికివున్నపుడే ఆస్తుల పంపిణీ చేశారనేది పూర్తిగా అబద్దం, అవాస్తమని షర్మిల పేర్కొన్నారు. 
 
తన తండ్రి వైఎస్ఆర్ ఎపుడూ కూడా తనను తక్కువ చేసి చూడలేదని, ఆయన సమాన వాటా ఉండాలని అనేవారని చెప్పారు. వైఎస్ స్థాపించినవన్నీ కుటుంబ వ్యాపారాలేనని, ఆ వ్యాపారాలకు జగన్ ఒక గార్డియన్ మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. వైఎస్ ఉద్దేశమేమిటో కుటుంబ సభ్యులకు, సన్నిహితులందరికీ తెలుసని అన్నారు. ఆయన బతికివున్నంతవరకు ఏ ఒక్క ఆస్తి పంపకం కూడా జరగలేదని తెలిపారు. అలాగే, వైఎస్ మరణించిన తర్వాత కూడా ఏ ఆస్తి పంపకాలు చేపట్టలేదన్నారు. ఇవాళ్లి వరకు తనకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదని షర్మిల వాపోయారు.