1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (12:38 IST)

వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు అందజేత...

ఏపీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరుమీద ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను సోమవారం అందజేశారు. తొలిసారిగా వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్ అవార్డులు అందజేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. 
 
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 59 అవార్డులను గవర్నర్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ చేతుల మీదుగా ఇచ్చారు. 29 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, 30 వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానం జరిగింది. 
 
9 సంస్థలకు అలాగే వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి 11 అవార్డులు ఇచ్చారు. కళలు, సంస్కృతికి 20 అవార్డులు, సాహిత్యం-7, జర్నలిజం-6, కొవిడ్‌ సమయంలో సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి-6 అవార్డులు అందజేశారు. నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. 
 
ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ, ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. వైఎస్సార్‌ వైద్య వృతి చేసినా.. వ్యవసాయం, విద్యారంగాలకు విశేష కృషి చేశారన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు. 
 
వ్యవసాయం, ఆక్వా, ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం ఉందన్నారు. కరోనా వ్యాక్సినేషన్లోనూ ఏపీ క్రియాశీలకంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడని ప్రార్థిస్తున్నానని గవర్నర్‌ అన్నారు. వైఎస్సార్‌ అవార్డులు అందుకున్నవారికి ఆయన అభినందనలు తెలిపారు.
 
అలాగే, సీఎం జగన్ మాట్లాడుతూ, నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్‌ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్‌ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందన్నారు.