1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 16 డిశెంబరు 2020 (15:39 IST)

రైతుకు వజ్రం దొరికింది, వేలం వేస్తే రూ.60 లక్షలు పలికింది : ప్రెస్ రివ్యూ

వజ్రం దొరకడంతో మధ్యప్రదేశ్‌లో ఒక రైతు లక్షాధికారి అయ్యారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు ఒక్కసారిగా లక్షాధికారి అయ్యారు. 14.90 క్యారెట్ల వజ్రం లభించడంతో ఆయన పంటపండింది.
 
మంగళవారం నిర్వహించిన వేలంలో ఈ వజ్రం రూ.60.60 లక్షలు పలికిందని నమస్తే తెలంగాణ రాసింది. పన్నా జిల్లాలోని కృష్ణ కల్యాణ్‌ పూర్‌కు చెందిన లక్ష్మణ్‌ యాదవ్‌ అనే రైతుకు గత నెలలో ఒక గనిలో ఈ వజ్రం లభించింది. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన పన్నా జిల్లా వజ్రపు గనులకు ప్రసిద్ధి అని పత్రిక వివరించింది.