మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (14:59 IST)

చిన్మయానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విద్యార్థిని అరెస్టు

కేంద్ర మాజీ హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు చిన్మయానందపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు. బుధవారం ఉదయం యువతిని కొత్వాలీ తీసుకెళ్లామని, ఆ తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్(ఎస్ఐటీ) చీఫ్ నవీన్ అరోరా బీబీసీకి చెప్పారు.

 
వైద్య పరీక్షల తర్వాత యువతిని మెజిస్ట్రేట్ సమక్షంలో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ విద్యార్థిని రిమాండుకు అనుమతించారు. దాంతో సిట్ ఆమెను జైలుకు తరలించింది. స్నేహితురాళ్లతో కలిసి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని విద్యార్థినిపై ఆరోపణలు ఉన్నాయి.

 
విద్యార్థిని ముందస్తు బెయిల్ పిటిషన్
అంతకుముందు అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఆమె అలహాబాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దానిని తోసిపుచ్చిన న్యాయస్థానం జిల్లా కోర్టుకు వెళ్లాలని సూచించింది. జిల్లా కోర్టు మంగళవారం బాధితురాలి దరఖాస్తు స్వీకరించింది. గురువారం అంటే సెప్టెంబర్ 26న విచారణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ దానికి ఒక రోజు ముందే ఎస్ఐటీ విద్యార్థినిని అరెస్టు చేసింది.

 
చిన్మయానందను సిట్ ఇప్పటికే అరెస్టు చేసింది. ఆయన్ను 14 రోజుల వరకు జైలుకు పంపించారు. అధికారం, బలం ఉపయోగించి బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పెట్టే సెక్షన్ 376(సి) కింద చిన్మయానంద్‌పై కేసు నమోదైంది. షాజహాన్‌పూర్‌లో ఉన్న ఎస్ఎస్ లా కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని చిన్మయానందపై వేధింపులు, కిడ్నాప్, బెదిరింపు ఆరోపణలు చేశారు. అధికారుల వైపు నుంచి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు పదేపదే చెబుతూ వచ్చారు.

 
చిన్మయానంద ఎవరు?
బీజేపీ మాజీ ఎంపీ చిన్మయానంద అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామమందిర ఉద్యమం చేసిన పెద్ద నేతల్లో ఈయన ఒకరు. షాజహాన్‌పూర్‌లో ఆయనకు ఒక ఆశ్రమం ఉంది. దానికి ఎన్నో విద్యాసంస్థల నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయి. ఎనిమిదేళ్ల క్రితం షాజహాన్‌పూర్‌కే చెందిన మరో మహిళ కూడా చిన్మయానందపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. ఆమె అప్పుడు ఆయన ఆశ్రమంలోనే ఉండేవారు.

 
అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయనకు వ్యతిరేకంగా నమోదైన కేసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. కానీ బాధితులు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో నడుస్తోంది.