1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 11 మే 2021 (12:23 IST)

మావోయిస్టులకు ఉచితంగా కోవిడ్‌ చికిత్స అందిస్తాం, సద్వినియోగం చేసుకోండి-ఏపీ పోలీసులు: ప్రెస్ రివ్యూ

మావోయిస్టులకు కోవిడ్ చికిత్స అందిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసినట్లు ఈనాడు దిన పత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది. 'ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో తిరుగుతున్న మావోయిస్టుల్లో చాలామంది కోవిడ్‌ లక్షణాలతో బాధ పడుతున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది.
 
గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్‌ ఏరియాలో దళ సభ్యుల్లో కొందరు ఒళ్లు నొప్పులు, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. కరోనా బారినపడిన వారికి సరైన సమయంలో, సరైన చికిత్స అందకపోవడం వల్ల చనిపోవడం చూస్తున్నాం. మావోయిస్టులుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ కరోనా లక్షణాలతో బాధపడుతుంటే, వెంటనే సమాచారం ఇస్తే ఉచితంగా చికిత్స అందేలా ఏర్పాటు చేస్తాం' అని విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ప్రకటించారు.
 
ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సరైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఆశ్రయిస్తే మీ చికిత్సకు, మీ ప్రాణాలకు మాది భరోసా అంటూ హామీ ఇచ్చారు. కోలుకున్నాక మీరు, మీ కుటుంబ సభ్యులు హాయిగా ఇంటికి వెళ్లడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి కూడా సోమవారం ఇదే తరహాలో విజ్ఞప్తి చేశారని ఈనాడు వివరించింది.