చెన్నై-హైదరాబాద్ల మధ్య బుల్లెట్ రైలు.. తిరుపతి మీదుగా జర్నీ
చెన్నై-హైదరాబాద్ల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు రానుంది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు ఖరారు చేసింది. సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికకు సూత్రప్రాయ ఆమోదం లభిస్తే, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయితే 778 కిలోమీటర్ల దూరంలోని చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం 12 గంటలుగా ఉన్న ప్రయాణం కేవలం 2 గంటల 20 నిమిషాలకు పరిమితం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
తొలుత చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్కు ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. అయితే, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మీదుగా ప్రాజెక్టును అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం రైల్వేకు విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రాజెక్టు కోసం ఒక్క తమిళనాడులోనే 223.44 హెక్టార్ల భూమి అవసరమని అక్కడి ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ రైట్స్ నివేదిక ఇచ్చింది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.