శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (10:31 IST)

చైనాను దెబ్బకొట్టిన కరోనా : కనిష్టంగా జీడీపీ

చైనాను కరోనా వైరస్ దారుణంగా దెబ్బకొట్టింది. ఫలితంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గడచిన సంవత్సరం చైనా స్థూల జాతీయోత్పత్తి రేటు 2.3 శాతంగా నమోదైంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత చైనాలో ఇంత తక్కువ జీడీపీ వృద్ధి నమోదవడం ఇదే తొలిసారి.
 
1970వ దశకం ప్రారంభంలో దేశంలో సంస్కరణలను అమలు చేసిన వేళ కనిష్ఠ వృద్ధి రేటును కళ్లజూసిన చైనా, ఆపై దూసుకుని వెళ్లింది. వృద్ధి రేటు పతనానికి కరోనా చూపిన ప్రభావమే కారణమని, స్వదేశంలోనూ, విదేశాల్లోనూ చైనాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ హెచ్చరించింది.
 
మరోవైపు, చైనాను కరోనా వైరస్ ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు. తాజాగా చైనాలో తయారవుతున్న ఐస్‌క్రీమ్‌లో కూడా ఈ వైరస్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఐస్ ఫ్యాక్టరీని మూసివేశారు. కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూడటంతో మరోమారు కలకలం చెలరేగింది. 
 
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా అప్రదిష్ట మూటగట్టుకున్న చైనాలో తాజాగా టియాన్జిన్ నగరంలో ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ క్రిములను గుర్తించారు. దాంతో ఆ బ్యాచ్‌కు చెందిన ఐస్‌క్రీమ్ బాక్సులన్నింటినీ కంపెనీ వెనక్కి తెప్పిస్తోంది. 
 
ఈ పరిణామంతో టియాన్జిన్లోని దఖియావోదావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిస్థితులు చక్కబడే వరకు కంపెనీ మూతవేశారు. దఖియావోదావో ఫుడ్ కంపెనీలో ఉద్యోగులు కూడా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు దీనిపై ఆంక్షలు విధించాయి.
 
మరోవైపు, ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీమ్ తిని కరోనా బారినపడినట్టు ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. ఈ కంపెనీ తాజాగా 29 వేల ఐస్‌క్రీమ్ కార్టన్లను అమ్మకానికి సిద్ధం చేసింది. టియాన్జిన్‌లో విక్రయించిన 390 కార్టన్లను గుర్తించి వెనక్కి తీసుకున్నారు. 
 
కాగా, దఖియావోదావో ఫుడ్ కంపెనీ తమ ఐస్‌క్రీముల్లో ఉపయోగించేందుకు న్యూజిలాండ్, ఉక్రెయిన్ నుంచి పాల ఉత్పత్తులును దిగుమతి చేసుకుంటుంది. వీటి ద్వారా కరోనా వైరస్ క్రిములు ఐస్‌క్రీముల్లోకి చేరి ఉంటాయన్న కోణంలోనూ విచారిస్తున్నారు.