1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (15:07 IST)

ఖాతాదారులకు షాకిచ్చిన ఈపీఎఫ్ - 40 యేళ్ళ కనిష్టానికి...

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) తన ఖాతాదారులకు తేరుకోలేని విధంగా షాకిచ్చింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను 8.5 శాతం నుంచి 8.1 శాతానికి గణనీయంగా తగ్గించింది. అంటే 16 యేళ్ల క్రితం ఉన్న వడ్డీ రేట్లపై ఇకపై అందివ్వనుంది. 2021-22 సంవత్సరానికిగాను 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అంతకుముందు 8.5 శాతంగా ఉంది. తగ్గింపు నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావంపడనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, అందుకే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైఖేల్ డయాస్ వెల్లడించారు. 
 
కాగా, గత 1977-78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ యేడాది పీఎఫ్‌పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018-19, 2016-17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమచేశారు. 2013-14, 2014-15లో 8.75 శాతం, 2015-16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. 
 
అయితే, కరోనా మహమ్మారి సమయంలో నగదు ఉపసంహరణలు పెరగడంతో చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము భారీగా తగ్గింది. దీంతో 2019-2020కిగాను 8.5 శాతానికి వడ్డీని తగ్గించారు. ఇపుడు దీన్ని 8.1 శాతంగా తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.