గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (12:20 IST)

పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత : నిర్మలా సీతారామన్

పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలోని ఆఖరి అంశాలను ఆమె ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆర్థిక ప్యాకేజీలోని చివరి విడత, ప్యాకేజీ-5 వివరాలను వెల్లడిస్తూ, ప్యాకేజీ-5లో భాగంగా కేంద్రం ఏడు రంగాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. 
 
ఇందులో మొదటిది, ఉపాధి హామీ, రెండోది ఆరోగ్యం, విద్యానుబంధ రంగాలు, మూడోది వ్యాపారాలు, కోవిడ్, నాలుగోది డీక్రిమినలైజేషన్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యాక్ట్‌, ఐదోది ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, ఆరోది పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పాలసీ, ఏడోది రాష్ట్ర ప్రభుత్వాలు - వనరులు అనే అంశాలు ఉన్నట్టు వివరించారు. 
 
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, ఒక దేశంగా మనం చాలా కీలకమైన దశలో నిలబడ్డామన్నారు ఇంత పెద్ద విపత్తు భారతదేశానికి ఒక ఛాలెంజ్‌ను ఒక అవకాశాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా జీవనం, జీవనోపాధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 
 
భూములు, శ్రామిక శక్తి, నగదు నిల్వలు, చట్టాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఛాలెంజ్‌కు తీసుకుని దేశాన్ని స్వయం సంవృద్ధి దిశగా నడిపించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయాన్ని తాము అవకాశంగా మలుచుకుంటున్నట్లు తెలిపారు. 
 
పేదలకు ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. వచ్చే మూడు నెలలు నిత్యావసరాలు అందిస్తామని ఇప్పటికే తెలిపామన్నారు. ఇప్పటికే 8.19 కోట్ల మంది రైతులకు నేరుగా రూ. 2 వేలు చొప్పున ఇచ్చామన్నారు. రైతులకు మొత్తం రూ. 3 వేల కోట్లు అందజేసినట్లు తెలిపారు. 
 
జన్‌ధన్‌ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ జరిగిందన్నారు. మహిళలకు మొత్తం రూ.10,025 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2.2 కోట్ల మంది నిర్మాణరంగ కూలీలకు రూ.3,950 కోట్లు ఇచ్చామన్నారు. అదేవిధంగా ఉజ్వల పథకం కింద 6.81 కోట్ల ఉచిత గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.