మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (16:56 IST)

కరోనా లాక్‌డౌన్.. బ్యాంకుల్లో కనీస నిల్వ అక్కర్లేదు... : విత్తమంత్రి

కరోనా వైరస్ మహమ్మారిని నుంచి ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఫలితంగా దేశంలో ప్రజలంతా తమతమ గృహాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ ఓ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల్లో కనీస నిల్వ అక్కర్లేదని తెలిపారు. 
 
ఆమె మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకుల్లో ఇకపై కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఖాతాదారులు అన్ని ఏటీఎంల్లో డబ్బు తీసుకోవచ్చని, 3 నెలల పాటు చార్జీలు లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. 
 
ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నా ఎలాంటి రుసుం ఉండబోదన్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మినిమమ్ బ్యాలన్స్ నిబంధన తొలగించడం, ఏ ఏటీఎంలోనైనా నగదు తీసుకునే సౌలభ్యం కల్పించడం సామాన్యుడికి ఊరట కలిగించనుంది. 
 
మరోవైపు, కరోనా వైరస్ నేపథ్యంలో భారీగా పతనమవుతూ వస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నష్టాల్లోకి జారుకున్నప్పటికీ... ఆ తర్వాత లాభాల బాటపట్టాయి. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలను ప్రకటిస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
 
దీంతో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 693 పాయింట్లు పెరిగి 26,674కి చేరుకుంది. నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 7,801కి ఎగబాకింది. ఐటీ, టెక్, ఎనర్జీ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. టెలికాం, కన్జ్యూమర్ గూడ్స్, రియాల్టీ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.