1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఈ బుడ్డోడు మాటలు వింటే మా కంపెనీ దివాలా తీయాల్సిందే : ఆనంద్ మహీంద్రా

chikoo - anand mahindra
థార్ 700 కారు గురించి ఓ బుడ్డోడు చెప్పిన మాటలు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఆ బుడ్డోడి మాటల వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ, ఈ బుడ్డోడు మాటలు వింటే మా కంపెనీ దివాలా తీయాల్సిందేనంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. 
 
సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ అయింది. ఇందులో చీకూ అనే బుడ్డోడు తన తండ్రితో మాట్లాడుతూ.. మహీంద్రా థార్‌ను కొంత మంది థార్‌గా వ్యవహరిస్తుంటారని చెబుతున్నాడు. అయితే, థార్ ఎక్స్ యూవీ 700 (XUv700) ఒక మోడల్ అని తెలిపాడు. ఎక్స్ యూవీ 700ని అతడు థార్ పొరబడ్డాడు. రెండూ ఒకటే అంటూ దాన్ని కొందామని తండ్రిని అడుగుతున్నాడు. ఎక్స్ యూవీ 700లో 700 ఉంది గనక దాని ధర రూ.700 అని అనుకున్నాడు.
 
పైగా, తండ్రి పర్సులో రూ.700 ఉన్నాయని.. ఆ డబ్బుతో బయటికెళ్లినప్పుడు కొనేద్దామని తండ్రితో చర్చిస్తున్నాడు. అయితే, ఆ బుడ్డాడు మాట్లాడిన తీరు మాత్రం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. పైగా అతడి మాటల్లోని అమాయకత్వం ముచ్చటగొల్పుతోంది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా కంటపడింది. ఈ వీడియోను ఆయన షేర్ చేస్తూ, చీకూకు చెందిన కొన్ని వీడియోలు చూసిన తర్వాత తానూ అతణ్ని ఇష్టపడడం మొదలుపెట్టానని తెలిపారు. 
 
అయితే, వీడియోలో అతడు చెప్పినట్లు థార్‌నను రూ.700 అమ్మితే త్వరలోనే తమ కంపెనీ దివాలా తీస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. నెటిజన్లూ బుడ్డాడి మాటలకు ఫిదా అయిపోయి తెగ కామెంట్లు చేస్తున్నారు. ఎక్సయూవీ 700 ధర రూ.17 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా.. థార్ రూ.10,98,000 నుంచి లభిస్తోంది.