1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

రిలయన్స్ కంపెనీ చెల్లించిన కార్పొరేట్ ట్యాక్స్ ఎంతో తెలుసా?

reliance retail
వార్షిక ఆదాయ పరిమితి దాటిన ప్రతి ఒక్క వ్యాపారి లేదా ఉద్యోగి ప్రభుత్వానికి ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ పన్ను చెల్లించాలి. అయితే ఇది ఆదాయపన్ను కాదు. కార్పొరేట్ ట్యాక్స్. మన దేశంలోని అనేక కంపెనీలు భారీ మొత్తంలో కేంద్రానికి కార్పొరేట్ పన్నును చెల్లిస్తున్నాయి. ఈ కోవలో టాటా గ్రూపు ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. 
 
మరోవైపు, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూపు గత యేడాది రూ.20730 కోట్ల మేరకు పన్ను చెల్లించింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ రూ.20300 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.12800 కోట్లు, బజాబ్ గ్రూపు రూ.10554 కోట్లు, వేదాంత గ్రూపు రూ.10547 కోట్లు చొప్పున పన్నులు చెల్లించి టాటా గ్రూపు తర్వాత వరుస స్థానాల్లో నిలిచాయి. 
 
ఇలా దేశంలోని వివిధ కంపెనీల నుంచి గత యేడాది కేంద్ర ప్రభుత్వానికి రూ.3.64 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు యేడాది ఈ మొత్తం రూ.3.41 లక్షల కోట్లుగా ఉంది. మిగతా ఆదాయ వనరులతో పోలిస్తే కేంద్రానికి కార్పొరేట్ ట్యాక్స్‌తోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు 
 
ఈ యేడాది జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12 శాతం వృద్ధితో జీఎస్టీ వసూళ్లు రూ.1,61,497 కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి నెల వారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల పైస్థాయిలో నమోదు కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 
 
గత నెల మొత్తం ఆదాయంలో సెంట్రల్ జీఎస్టీ రూ.31,013 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.38,202 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,292 కోట్లుగా ఉంది. పరిహార సెస్సు రూపంలో మరో రూ.11,900 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.57 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా.. ఏప్రిల్లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయి రూ.1.87 లక్షల కోట్లకు పెరిగాయి.
 
ఆ కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) వసూళ్ల సగటు రూ.1.69 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, 2022-23లో ఇదేకాలానికి ఆదాయ సగటు రూ.1.51 లక్షల కోట్లు 2021-22లో రూ.1.10 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా, గత నెలకు ఆంధ్రప్రదేశ్ నుంచి జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 16 శాతం వృద్ధితో రూ.3.477.42 కోట్లకు చేరుకోగా.. తెలంగాణ నుంచి వసూళ్లు 20 శాతం పెరుగుదలతో రూ.4,681.39 కోట్లుగా నమోదయ్యాయి.