1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జులై 2023 (21:44 IST)

2021-2023 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌ కోసం వేడుకగా గ్రాండ్ కాన్వొకేషన్ నిర్వహించిన ఐఎంటి హైదరాబాద్

image
ప్రీమియర్ బిజినెస్ స్కూల్, ఐఎంటి హైదరాబాద్ తమ క్యాంపస్‌లో 2021-2023 బ్యాచ్ కోసం స్నాతకోత్సవ (కాన్వొకేషన్) వేడుకను నిర్వహించటం ద్వారా మరో విద్యా సంవత్సరం విజయవంతంగా ముగించింది. ఐఎంటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్. కె. శ్రీహర్ష రెడ్డి నేతృత్వంలో ముఖ్య అతిథి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. డైరెక్టర్, ముఖ్య అతిథితో పాటు, కాన్వొకేషన్లో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, అధ్యాపకులు సైతం పాల్గొన్నారు. ముఖ్య అతిథి, డైరెక్టర్లు జ్యోతి ప్రకాశనం చేయటంతో వేడుక ప్రారంభమైంది. అనంతరం డైరెక్టర్ అధికారికంగా కాన్వొకేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు.
 
డాక్టర్ కె. శ్రీహర్ష రెడ్డి తమ వార్షిక నివేదికను సమర్పిస్తూ 2023 విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలను వెల్లడించారు. ఐఎంటి హైదరాబాద్ యొక్క కార్యక్రమాలను గురించి వెల్లడిస్తూ ఆయన గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ 3వ ఎడిషన్ గురించి మాట్లాడారు. ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో విభిన్న సంస్కృతులు, విలువలు మరియు వ్యాపార పద్ధతులకు విద్యార్థులు తెలుసుకునేందుకు ప్రారంభించిన వినూత్నమైన కార్యక్రమమిది. 
 
డీఈ షా, బార్‌క్లేస్ మరియు యాక్సెంచర్‌తో సహా దాదాపు 68 కంపెనీలు నియామకాల కోసం క్యాంపస్‌ను సందర్శించి, గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు అందించిన లాభదాయకమైన అవకాశాలను గురించి డాక్టర్ రెడ్డి మరింతగా వెల్లడించారు. ఐఎంటి  హైదరాబాద్ చీఫ్ మెంటర్ శ్రీ కమల్ నాథ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, వారి విద్యా ప్రయాణంలో విలువలు, సూత్రాలు, జ్ఞానం మరియు నైపుణ్యాలను నొక్కిచెప్పారు.  గ్రాడ్యుయేట్‌లను వారి వృత్తిపరమైన కార్యకలాపాలలో ఆవిష్కరణ, సృజనాత్మకత మరియు వ్యవస్థాపకత యొక్క శక్తిని ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు. 
 
ముఖ్య అతిథి శ్రీ సతీష్ రెడ్డి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన ఆయన తాను కెమికల్ ఇంజినీరింగ్ చదివి రసాయన శాస్త్రవేత్తగా పనిచేసినప్పటికీ, తన సుదీర్ఘ కెరీర్‌లో వివిధ నిర్వహణ పాత్రలు పోషించానని, ఈరోజు తాను తన కెరీర్లో తెలుసుకున్న అంశాలను, అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటున్నానని వెల్లడించారు. ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆయన ఆకాంక్షించారు. 2021-2023 బ్యాచ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐదు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలు అందించబడ్డాయి. ఐఎంటి హైదరాబాద్‌లోని డీన్ (అకడమిక్స్) డాక్టర్ చక్రపాణి చతుర్వేదుల కృతజ్ఞతలను వెల్లడించటంతో కాన్వకేషన్ వేడుక ముగిసింది.