1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (09:02 IST)

కరోనా స్ట్రెయిన్‌ యమ డేంజర్.. జర జాగ్రత్త గురూ... వైద్యుల వార్నింగ్

బ్రిటన్‌లో కొత్తగా పురుడు పోసుకున్న కరోనా స్ట్రెయిన్‌ ఇపుడు ప్రపంచానికి వణికిస్తోంది. ఈ వైరస్‌ చాలా డేజర్ అంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల బయటకు వెళ్లేటపుడు విధిగా మాస్క్ ధరించాలని వారు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా సమూహాలు ఉన్నచోటికి వెళ్లకపోవడమే మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
కాగా, ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ వణికిపోతోంది. పైగా, ఈ దేశంలో ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే వేలాది మందిని ఆస్పత్రిపాల్జేసింది. ఈ వైరస్ సోకడం వల్ల చనిపోయేవారి సంఖ్య మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
వచ్చే ఏడాది దీని ప్రభావం గణనీయంగా ఉండబోతోందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన సెంటర్ ఫర్ మేథమేటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సంస్థ పరిశోధకులు వెల్లడించారు.
 
ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌తో పోల్చితే ఈ కొత్త స్ట్రెయిన్ 56 శాతం అధికంగా వ్యాపిస్తుందని తేలింది. ఈ వైరస్ ఎంత తీవ్రతతో వ్యాధి లక్షణాలు కలుగజేస్తుందనడానికి ఇప్పటివరకైతే స్పష్టమైన ఆధారాలు లేవని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.
 
బ్రిటన్ ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనిపై ఇదే తరహా అంచనాలు వెలువరించింది. ఇతర కరోనా రకాలతో పోల్చితే ఇది 70 శాతం వేగవంతమైనదని పేర్కొంది. ఇప్పటివరకు ఇది 12 ఉత్పరివర్తనాలకు లోనైందని, కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్లపై ఈ అంశం ప్రభావం చూపుతుందని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ పాట్రిక్ వాలన్స్ తెలిపారు.