గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:34 IST)

దేశంలో కరోనా సునామీ : నవంబరు థర్డ్ వేవ్?

దేశ వ్యాప్తంగా కరోనా సునామీ కొనసాగుతోంది. ఈ రెండో దశ వ్యాప్తితో దేశ ప్రజలంతా తల్లడిల్లిపోతున్నారు. ఈ రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో థర్డ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడో వేవ్‌ నుంచి తప్పించుకోవాలంటే 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేయించుకోవాలని కోరుతున్నారు. 
 
ఈ ఏడాది నవంబరు నాటికి రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మొదటిసారి వచ్చింది పెద్ద వేవ్‌ కానే కాదని, ఇప్పుడు వచ్చిందే అసలైన వేవ్‌ అని పేర్కొంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీకా వేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 
 
అయినప్పటికీ అంచనాలకు తగ్గట్లుగా ప్రజలు టీకా తీసుకోవడం లేదని వైద్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఆ వయసు పైబడిన వారు 2.62 కోట్ల మంది ఉంటారని వైద్యశాఖ అంచనా. ప్రజలు టీకా తీసుకోకపోతే 6 నెలల్లో థర్డ్‌ వేవ్‌ తప్పదని హెచ్చరిస్తోంది.