మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జులై 2020 (17:14 IST)

మొత్తం కరోనా కేసులు 6 లక్షలు.. కానీ యాక్టివ్ కేసులు 2.26 లక్షలు మాత్రమే

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 6 లక్షల మార్కును దాటిపోయింది. మరో అర లక్ష కేసులు నమోదైతే రష్యాను దాటిపోతుంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశంలో మొత్తం కరోనా కేసుల ఆరు లక్షల వరకు ఉంటే.. ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 2.26 లక్షలు మాత్రమే. మరో 3.59 లక్షల మంది ఈ వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక జాబితాను రూపొందించింది. టాప్‌-15 రాష్ట్రాల జాబితాను వెల్ల‌డించింది. ఈ జాబితాలో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా, తెలంగాణ ప‌దో స్థానంలో ఉన్న‌ది. మొత్తం 93,154 మంది రిక‌వ‌రీ అయిన వారితో మ‌హారాష్ట్ర టాప్ ప్లేస్‌లో నిలువగా.. 5,353 మంది రిక‌వ‌రీ అయిన క‌రోనా బాధితుల‌తో ఒడిశా 15 స్థానంలో నిలిచింది. 
 
మ‌హారాష్ట్ర త‌ర్వాత స్థానాల్లో వ‌రుస‌గా ఢిల్లీ (59,992 మంది రిక‌వ‌రీ అయిన క‌రోనా బాధితులు), త‌మిళ‌నాడు (52,926), గుజ‌రాత్ (24,030), ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (16,629), రాజ‌స్థాన్ (14,574), ప‌శ్చిమ‌బెంగాల్ (12,528), మ‌ధ్య‌ప్ర‌దేశ్ (10,655), హ‌ర్యానా (10,499), తెలంగాణ (8,082), క‌ర్ణాట‌క (8,063), బీహార్ (7,946), ఆంధ్ర‌ప్ర‌దేశ్ (6,988), అసోం (5,851) ఉన్నాయి. త‌ర్వాత స్థానంలో ఒడిశా ఉన్న‌ది.