1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (14:45 IST)

టీకా వేయించుకున్న వ్యక్తికి కరోనా సోకితే.. కుటుంబ సభ్యులను రక్షించినట్టే...

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కోరనా వైరస్ సోకినపక్షంలో.. ఆ రోగి.. తన కుటుంబానికి చెందిన సభ్యులను కరోనా వైరస్ నుంచి 50 శాతం మేరకు రక్షించినట్టేనని ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వారు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
ప్రపంచాన్ని కుదిపేస్తున్ వ్యాక్సిన్... కరోనా వైరస్‌ నుంచి రక్షించడమేకాకుండా వ్యాప్తిని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు.
 
ఈ మేరకు పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌(పీహెచ్‌ఈ) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత మహమ్మారి బారిన పడిన వారి నుంచి టీకా తీసుకోని కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు గుర్తించారు. 
 
దీంతో టీకా వైరస్‌ బారి నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైందని బ్రిటన్‌ హెల్త్‌ సెక్రటరీ మ్యాట్‌ హాన్‌కాక్‌ వెల్లడించారు. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోందన్నారు.
 
ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనీసం ఒకరు కరోనా బారిన పడిన 24 వేల కుటుంబాల్లో 57 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై ఈ అధ్యయనం జరిపారు. ఈ ఫలితాల్ని పది లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారి సమాచారంతో పోల్చి చూడగా.. తాజా విషయం వెలుగులోకి వచ్చింది. 
 
గతంలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఒక డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత వైరస్‌ వల్ల తలెత్తే లక్షణాలు 65 శాతం తగ్గినట్లు తేలిన విషయం తెలిసింది. ఇళ్లు, జైళ్లు, లేదా కలిసి నివాసం ఉండే ప్రదేశాల్లో వైరస్‌ సంక్రమణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు గతంలోనే గుర్తించారు.