1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (12:20 IST)

మార్‌బర్గ్ వైరస్... బీ కేర్ ఫుల్.. ఎబోలా, కోవిడ్‌ల తరహాలోనే..?

కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోనేలేదు. తాజాగా మరో వైరస్ ప్రజలను భయపెడుతోంది. అదే మార్‌బర్గ్ వైరస్‌. ఆఫ్రికాలోని గినియా దేశంలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ దేశంలో మార్‌బర్గ్ తొలి కేసు నమోదు అయ్యింది. ఎబోలా, కోవిడ్‌ల తరహాలోనే మార్‌బర్గ్ వైరస్ ప్రమాదకరమైందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 88 మంది చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గబ్బిలాల నుంచి ఈ వైరస్ సోకుతుందని వెల్లడించింది.
 
మార్‌బర్గ్ వైరస్ రోసెట్టస్ గబ్బిలాలు ఉండే చోట కనిపిస్తుందని.. వాటి ఆవాసాలకు సమీపంలోకి వెళ్లే వారికి ఈ వైరస్ సోకుతుందని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు సోకిన తర్వాత ఇతరులకు సులువుగా వ్యాపిస్తుందని చెప్పింది. వైరస్ బారిన పడిన వారు ఉపయోగించిన వస్తువుల ద్వారా వ్యాపించే అవకాశం ఉందంది. ఈ వైరస్ జాతీయ, ప్రాంతీయ స్థాయిలో మాత్రమే విస్తరిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశాలు లేవంది.
 
సియర్రా లియోన్, లిబేరియా బోర్డర్ వద్ద ఉన్న ఓ గ్రామంలో మార్‌బర్గ్ కేసు నమోదు అయ్యింది. తొలుత ఆ పేషెంట్‌కు మలేరియా పరీక్ష నిర్వహించారు. కానీ ఆ తర్వాత అది మార్‌బర్గ్ అని తేల్చారు. మార్‌బర్గ్ వైరస్ సోకగానే తీవ్ర జ్వరం, విపరీతమైన తలనొప్పి, చికాకు కలుగుతుంది. 
 
ఈ వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స లేదు. అయితే, ఆయా లక్షణాలకు ప్రత్యేకంగా చికిత్సను అందించడం ద్వారా బాధితుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. గతంలో దక్షిణాఫ్రికా, కాంగో, కెన్యా, ఉగాండా, అంగోలా దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.