1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (13:02 IST)

మిల్కాసింగ్ సతీమణి నిర్మల్ కౌర్ మృతి.. కరోనాతో కన్నుమూత

Milkha Singh
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ సతీమణి నిర్మల కౌర్ (85) కరోనాతో కన్నుమూశారు. మొహలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు వారాల పాటు కరోనాతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. మిల్కా సింగ్‌ భార్య, భార‌త మ‌హిళ‌ల వాలీబాల్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌ నిర్మలా కౌర్ మరణించేనాటికి ఆమె వ‌య‌స్సు 85 సంవ‌త్స‌రాలు.
 
గ‌త‌నెల ఆమె క‌రోనా బారిన ప‌డ‌డంతో చండీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ.. గత వారం రోజులుగా ఆమె పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆదివారం ఆమె క‌న్నుమూసిన‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 
 
గత నెలలో మిల్కాసింగ్‌తో పాటు ఆయన భార్య నిర్మల కౌర్ కోవిడ్ బారినపడ్డారు. మే 24న నిర్మలా సింగ్ మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత రెండు రోజులకే మిల్కాసింగ్ కూడా కోవిడ్ 19, న్యుమోనియా సమస్యలతో అదే ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల తర్వాత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు డాక్టర్లు డిశ్చార్జి చేశారు.
 
మరోవైపు మిల్కా సింగ్‌ సైతం కరోనాతో నిర్మల చేరిన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. చికిత్సకు బాగా స్పందించిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. కానీ, ఆయనపై ఇంకా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భార్య నిర్మల అంత్యక్రియలకు మాత్రం ఆయన హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 85 ఏళ్ల నిర్మల పంజాబ్‌లో 'డైరెక్టర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఫర్‌ వుమెన్‌'గా కూడా వ్యవహరించారు.