గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (07:31 IST)

బ్రిస్బేన్ టెస్ట్ : పట్టుబిగిస్తున్న భారత్ - తడబడుతున్న కంగారులు

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పట్టుబిగిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రీజ్‌లో తడబడుతున్నారు. ముఖ్యంగా, హైదరాబాదీ బౌలర్‌ సిరాజ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లను పడగొట్టాడు. 
 
ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌ వేసిన సిరాజ్‌ మొదట లబుషేన్‌ను ఔట్‌ చేశాడు. దీంతో 25 పరుగులు చేసిన లబుషేన్‌ మూడో వికెట్‌ రూపంలో వెనుతిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మ్యాథ్యూ వేడ్‌ను డకౌట్‌ చేశాడు. దీంతో ఆసీస్‌ 147 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో లభించిన స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. స్వల్ప పరుగుల తేడాతో వెంటవెంటనే మూడు వికెట్లను కోల్పోయింది. అంతకు ముందు జట్టు స్కోరు 91 పరుగుల వద్ద డేవిడ్‌ వార్నర్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ వికెట్ల ముందు దొరకబట్టాడు. 
 
దీంతో 75 బంతుల్లో 48 పరుగులు చేసిన వార్నర్‌ రెండో వికెట్‌ రూపంలో వెనుతిరిగాడు. స్టీవ్‌ స్మిత్ 10 (9), గ్రీన్‌ 1 (8)  ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే హారిస్‌ను శార్ధూల్‌ ఠాకూర్‌ ఔట్‌చేశాడు. ప్రస్తుతం ఆసిస్‌ 160 పరుగుల ఆధిక్యంలో ఉన్నది.