గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:44 IST)

అప్ఘాన్ క్రికెట్‌లో విషాదం : కోమాలో ఉన్న క్రికెటర్ మృతి!

అప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డులో విషాదం నెలకొంది. కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన క్రికెటర్ నజీబ్ తరకై (29) తుదిశ్వాస విడిచారు. గత శుక్రవారం ఆయన జలాలబాద్‌లోని మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఆయనను ఓ కారు ప్రమాదవ శాత్తూ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నజీబ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయాడని వైద్యులు ఆ సమయంలో చెప్పారు. 
 
అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూ రాగా, మంగళవారం మృతి చెందినట్టు అఫ్ఘనిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఈ రోజు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించింది. "దూకుడుగా ఆడే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌, మంచి వ్యక్తి నజీబ్‌ తరకై మృతి పట్ల అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్ బోర్డు, దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయి ఆయన మనందరిని విషాదంలో ముంచారు. ఆయన పట్ల అల్లా కరుణ చూపాలని కోరుకుంటున్నాము" అంటూ ఏసీబీ ట్వీట్ చేసింది. 
 
కాగా, 2014లో ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నజీబ్... కెరీర్‌లో మొత్తం 12 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైట్‌ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ 2017లో గ్రేటర్‌ నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 90 పరుగులు చేశాడు. టీ20ల్లో ఆయన చేసిన అత్యుత్తమ స్కోరు ఇదే కావడం గమనార్హం. 
 
అలాగే, 2017 మార్చి 24న ఐర్లాండ్‌ లో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ ఆయన ఆడాడు. ఆయన ఆడిన ఏకైక వన్డే మ్యాచ్‌ ఇదే. ఆ మ్యాచ్‌లో ఆయన 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివరిసారిగా ఆయన గత ఏడాది సెప్టెంబరు 15న బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు.