శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (13:29 IST)

ప్రతి భారతీయుడు హృదయం గర్వంతో ఉప్పొంగి పోయేలా చేశారు : అమితాబ్

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మూడో టెస్టులో అద్వితీయ పోరాటపటిమ కనబర్చిన భారత జట్టు డ్రా చేసుకుంది. గెలుపు ఆశల నుంచి ఓటమి ప్రమాదంలోకి జారుకున్న టీమిండియాను హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ జోడీ ఆదుకున్న తీరు టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా నిలుస్తుంది. 
 
దీనిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. అత్యంత కష్టసాధ్యమైన పరిస్థితుల్లో మ్యాచ్‌ను డ్రాగా ముగించారని అభినందించారు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత ప్రదర్శన చేశారని కితాబునిచ్చారు. 
 
గాయాల బెడద, జాత్యహంకార దూషణల పర్వం కలిగించిన విసుగు నుంచి ఉపశమనం కలిగిస్తూ మ్యాచ్‌ను‌ సురక్షితంగా ముగించారని అమితాబ్ కొనియాడారు. 'టీమిండియా... నువ్వు అత్యంత దృఢవైఖరి కనబర్చావు... ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశావు' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
 
కాగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో చివ‌రి రోజు భార‌త్ ఐదు వికెట్లు కోల్పోయిన త‌ర్వాత గెలిచే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో వికెట్ కాపాడుకోవ‌డానికే భార‌త్  ప్రాధాన్య‌త ఇచ్చింది. క్రీజులో హ‌నుమ విహారి, అశ్విన్ ఇదే ప్ర‌య‌త్నం చేశారు. వారిద్ద‌రూ పూర్తిగా డిఫెన్స్ ఆడి మ్యాచ్ డ్రాగా ముగిసేలా చేశారు. ఈ క్ర‌మంలో దాదాపు 240 బంతుల్లో వారు 50 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని మాత్ర‌మే నెల‌కొల్ప‌డం గ‌మ‌నార్హం.
 
నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు ముగిశాయి. 1-1తో ఇరు జ‌ట్లు స‌మంగా నిలిచాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 338కు ఆలౌటైన విష‌యం తెలిసిందే. రెండో ఇన్నింగ్సులో ఆరు వికెట్ల న‌ష్టానికి 312 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది.
 
భార‌త్ తొలి ఇన్నింగ్సులో 244కే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్సులో ఐదో రోజు 98/2 ఓవ‌ర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భార‌త్ ఐదు వికెట్ల నష్టానికి 334 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో రోహిత్ శ‌ర్మ 52, శుభ్ మ‌న్ గిల్ 31, పుజారా 77, ర‌హానె 4, రిష‌బ్ పంత్ 97, హ‌నుమ విహారి 23 (నాటౌట్), ర‌వి చంద్రన్ అశ్విన్ 39 (నాటౌట్) ప‌రుగులు చేశారు. రెండో ఇన్నింగ్సులో ఆసీస్ బౌల‌ర్ల‌లో జోష్ , లైయ‌న్‌ల‌కు చెరో రెండు వికెట్లు, క‌మ్మిన్స్‌కు ఒక వికెట్టు దక్కాయి.