మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (12:33 IST)

ధోనీ జట్టుకు భారంగా మారాడా? అజారుద్దీన్ ఏమంటున్నారు...

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై రకరకాల చర్చలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ ఆటతీరులో మార్పు వచ్చిందని అందువల్ల ఆయన తక్షణం రిటైర్మెంట్ ప్రకటించాలంటూ ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ధోనీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పారామిలిటరీ ట్రైనింగ్ కోసం రెండు నెలల పాటు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధోనీ భవిష్యత్ ఏంటన్నది ఎవరికీ తెలియదు. సెలెక్టర్లు మాత్రం ధోనీ భవితవ్యాన్ని ఆయనకే వదిలివేశారు.
 
దీనిపై మాజీ కెప్టెన్ మొహ్మద్ అజారుద్దీన్ స్పందించారు. రిటైర్మెంట్‌పై ధోనీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో లేనిపోని అపోహలు, అపార్థాలు వస్తున్నాయి. ధోనీ రిటైర్ అవ్వాలని కొందరు, రిటైర్ కాకూడదని మరికొందరు ఎవరికి తోచినట్టు వాళ్లు రాస్తున్నారు. నా వరకు అయితే ధోనీ ఫిట్‌గా ఉన్నంతకాలం భావిస్తే నిస్సంకోచంగా ఆటను కొనసాగించాలని కోరుకుంటాను అని చెప్పారు. 
 
పైగా, చాలా సందర్భాల్లో ఎంతోకాలం పాటు క్రికెట్ ఆడిన తర్వాత ఆసక్తి సన్నగిల్లడం సహజం. ధోనీ ఆడాలనుకుంటే మాత్రం దూకుడుగా ఆడాలని చెబుతాను. కొంత వయసు పైబడిన తర్వాత ఆటలో వేగం మందగిస్తుంది. ధోనీ విషయంలో అలా కనిపించడంలేదు కాబట్టి తన సహజసిద్ధ ఆట ఆడుతున్నంతకాలం భారత జట్టుకు మేలు జరుగుతుంది. ఇప్పుడు రెండు నెలలు ఆట నుంచి విశ్రాంతి తీసుకుంటానని చెబుతున్నాడు. కానీ ఆ తర్వాత ఏంటనేది కూడా ధోనీ చెప్పాలి. ధోనీ ఓ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది సరైనదే అవుతుందని భావిస్తాను అని అజారుద్దీన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.