1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (11:18 IST)

కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు : 12 వేల రన్స్ పూర్తి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. 
 
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అనేక రికార్డులను వరుసగా అధిగమిస్తూ వస్తున్న కోహ్లీ... ఈ దఫా, అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఈ గేమ్ ప్రారంభానికి ముందు 11,977 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ, మరో 33 పరుగులు సాధించడం ద్వారా ఈ మైలురాయిని చేరుకోగా, అందుకు 242 వన్డే ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. గతంలో కోహ్లీ పేరిట ఈ రికార్డు ఉంది. 
 
సచిన్ తన 300వ ఇన్నింగ్స్‌లో 12 వేల పరుగుల మైలురాయిని తాకాడు. మొత్తం 463 ఇన్నింగ్స్ ఆడిన సచిన్, తన ఖాతాలో 18,426 పరుగులను వేసుకోగా, ఆ రికార్డును కూడా కోహ్లీ అధిగమించే అవకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
 
తన 205వ ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగుల మైలురాయిని తాకిన కోహ్లీ, ఆపై 17 ఇన్నింగ్స్‌లలోనే మరో 1000 పరుగులు చేశాడు. దాని తర్వాత మరో 1000 పరుగులకు 22 ఇన్నింగ్స్‌లను తీసుకున్నాడు. ఇదే ఊపుతో కొనసాగితే, మరో 150 ఇన్నింగ్స్‌లలోనే సచిన్ చేసిన పరుగులను కోహ్లీ దాటే వీలుంటుంది.