శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (17:31 IST)

సిడ్నీ వన్డే : మళ్లీ ఓడిన టీమిండియా - వన్డే సిరీస్ ఆస్ట్రేలియా వశం

విరాట్ కోహ్లీ సేన మళ్లీ ఓడింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా, ఆదివారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ పోరాడిఓడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఉంచిన 390 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేయగలింది. దీంతో 51 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా వన్డే సిరీస్‌ను కంగారులు కైవసం చేసుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ముఖ్యంగా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వరుసగా రెండో సెంచరీ బాదాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ప్రపంచస్థాయి పేసర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన వేళ సిడ్నీ మైదానం మరోసారి పరుగుల జడివానలో తడిసిముద్దయింది. దీంతో భారత్ ముంగిట 390 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా వార్నర్, ఫించ్‌లు ఓపెనర్లుగా దిగి.. తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వార్నర్ 83 పరుగుల వద్ద, ఫించ్ 60 రన్స్ వద్ద ఔట్ అయ్యారు. వీరిలో ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి, ఒక సిక్సు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతడు 77 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత మూడో ఆర్డరులో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. టీమిండియా బౌలింగును చీల్చిచెండాడుతూ 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. స్మిత్ కేవలం 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 104 పరుగులు నమోదు చేశాడు. స్మిత్‌తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన మార్నస్ లబుషేన్ 61 బంతుల్లో 70 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.
 
ఇక, మ్యాచ్ ఆఖరులో విధ్వంసం అంతా గ్లెన్ మ్యాక్స్ వెల్ దే. చిచ్చరపిడుగులా చెలరేగిన మ్యాక్సీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో చకచకా 63 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ ఏడుగురితో బౌలింగ్ చేయించినా ఆసీస్ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడలేదు. బ్యాటింగుకు అనుకూలిస్తున్న సిడ్నీ పిచ్‌పై భారత బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
 
ఆ తర్వాత 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. ఓపెనర్లు అగర్వాల్ (28), ధావన్ (30)లు తక్కువ స్కోరుక వెనుదిరిగారు. అప్పటి నుంచి వికెట్లు క్రమం తప్పకుండా పడుతూ వచ్చాయి. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే భారీ స్కోరు చేయగలిగారు. కోహ్లీ 87 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేయగా, రాహుల్ 66 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత ఆటగాళ్లంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. శ్రేయాస్ అయ్యర్ 38, పాండ్యా 28, జడేజా 24, షైనీ 10, షమీ 1, బుమ్రా 0 చొప్పున పరుగులు చేశారు. దీంతో 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 51 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొంది, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3, హాజిల్‌వుడ్, జంపాలు రెండేసి వికెట్లు తీయగా, హెన్రీక్యూ, మ్యాక్స్‌వెల్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.