1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (09:46 IST)

ఇక సఫారీలతో పోరుకు భారత్ సిద్ధం .. ఆ రెండు మ్యాచ్‌లలో టీమిండియా ఓడిపోతే...

indian players
సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు విజయయాత్ర కొనసాగిస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌లలో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా గురువారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసి ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 
 
భారత ఓపెనర్ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్లు అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత పేస్ దళం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా ధాటికి శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ వరసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది.
 
ఈ అద్భుత గెలుపుతో టీమిండియా వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ బెర్త్‌ని కూడా ఖరారు చేసుకుంది. 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. అయితే రన్‌రేట్ విషయంలో దక్షిణాఫ్రికా (2.290) భారత్ కంటే మెరుగ్గా మెరుగ్గా ఉంది. ఇక టాప్-4లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
 
గ్రూప్ దశలో భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సఫారీలతో పోరుకు సై అంటుంది. నెదర్లాండ్స్‌తో ఈ టోర్నీలో తన చివరి లీగ్ మ్యాచ్‌ను భారత్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే అగ్రస్థానంలో నిలబడుతుంది. ఒకవేళ రెండింటిలోనూ ఓడిపోతే మాత్రం 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. 
 
అయితే ఈ సమీకరణంలో ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే భారత్ 3వ స్థానానికి దిగజారే ఛాన్స్ లేకపోలేదు. చెరో 14 పాయింట్లు ఉంటాయి కాబట్టి ఎవరిది ఏ స్థానం అనేది రన్‌రేట్ నిర్ణయిస్తుంది. ఒకవేళ టీమిండియా ఒక మ్యాచ్ ఓడి, దక్షిణాఫ్రికాకు 2 విజయాలు సాధిస్తే ఇరు జట్లకు అప్పుడు 16 పాయింట్లు ఉంటాయి. రన్‌రేట్ ఆధారంగా ఒకటి, రెండు స్థానాలు ఖరారు కానున్నాయి.