శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జులై 2024 (16:10 IST)

ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో గెలిచిన భారత ఆటగాడు.. కానీ రికార్డుల నుంచి తొలగింపు!!

ప్యారిస్ వేదికగా విశ్వక్రీడా పోటీలు (ఒలింపిక్స్) జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత మేటి షట్లర్ లక్ష్య సేన్‌ విజయం సాధించాడు. కానీ, అతనికి అనూహ్యంగా చుక్కెదురైంది. అతని విజయాన్ని ఒలింపిక్స్ రికార్డుల నుంచి తొలగించారు. లక్ష్యసేన్ ప్రత్యర్థి మ్యాచ్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. దీంతో లక్ష్యసేన్ విజయం ఒలింపిక్స్ క్రీడా పోటీల నిబంధనల మేరకు రద్దు అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ విశ్వక్రీడా పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్.. గ్వాటమాలాకు చెందిన కెవిన్ కోర్డన్‌తో తలపడ్డారు. 21-8, 22-20 తేడాతో వరుస సెట్లలో పైచేయి సాధించాడు. అయితే, తొలి సెట్‌లో మొదటి నుంచి లక్ష్యసేన్ పైచేయి సాధించగా, రెండో సెట్‌లో ఆట పోటాపోటీగా సాగింది. చివరకు లక్ష్యసేన్ స్వల్పతేడాతో రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. 
 
అయితే, ప్రత్యర్థి కార్డన్ మణికట్టు గాయం కారణంగా మ్యాచ్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. దీంతో గ్రూపు ఎల్‌లో ఇండోనేషియా, బెల్జియం క్రీడాకారులతో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో లక్ష్యసేన్ గెలుపును కూడా రికార్డుల నుంచి తొలగించారు. తదుపరి మ్యాచ్‍‌ల ఆధారంగా సేన్ ర్యాంకు, స్కోరును నిర్ణయిస్తారు. 
 
మరోవైపు, ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు ఈ టోర్నీలో తొలి పతకం వరించిన విషయం తెల్సిందే. భారత షూటర్ మనూ బాకర్ కాంస్య పతకాన్ని అందించి చరిత్ర సృష్టించారు. దీంతో ఆమెకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోను చేసి అభినందనలు తెలిపారు. దేశం గర్వపడేలా చేశావంటూ కితాబిచ్చారు.