1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (07:13 IST)

అరంగేట్రంతోనే అదరగొట్టింది - ఐపీఎల్ విజేతగా గుజరాత్

hardik pandya
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ అంచె పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోటీలో గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్రంతోనే అదరగొట్టింది. ఫలితంగా ఐపీఎల్ 15వ సీజన్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించిన 131 పరుగుల విజయలక్ష్యాన్ని ఎలాంటి సంచనాలు లేకుండా సునాయాసంగా ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా ఐఎపీఎల్‌లోకి అడుగుపెట్టిన తొలిసారే టైటిల్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో జైశ్వాల్ 20, బట్లర్ 39, శాంసన్ 14, పడిక్కల్ 2, హెట్మెయిర్ 11, అశ్విన్ 6, రియాన్ 15, బౌల్ట్ 11 చొప్పున పేలవ ప్రదర్శనతో పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టులో ఓపెనర్ సాహూ (5) త్వరగా ఔట్ అయినప్పటికీ గిల్ (45 నాటౌట్), వేడ్ (8), హార్దిక్ పాండ్యా (34, మిల్లర్ (32 నాటౌట్)లు రాణించగా, అదనంగా 9 పరుగులు వచ్చాయి. దీంతో 18.1 ఓవర్లలో మొత్తం మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి ఐపీఎల్ 15 సీజన్ విజేతగా నిలిచింది. 
 
ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అలాగే రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ.13 కోట్లు, క్వాలిఫయర్-2లో ఓటమిపాలై టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు రూ.7 కోట్లు లభించింది. అలాగే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి పాలైన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా రూ.6.50 కోట్ల ప్రైజ్ మనీని అందజేశారు.